విధాత : అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి అమెరికాలోని ఏడు ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్,
3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో జులై 3 వరకు ప్రధాన నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు.
తిరుమల ఆలయం నుంచే స్వామివారి విగ్రహాలను,అర్చకులను అమెరికాకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. తిరుమలలో తయారైన లడ్డూలను అక్కడ అందజేస్తామని పేర్కొన్నారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
తిరుమలలో భక్తుల రద్దీ
వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. వెలుపల కూడా భక్తులు దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 25 గంటల సమయం పడుతున్నది. నిన్న శుక్రవారం 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 39,837 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.70 వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించారు.