Nalgonda: అంతరాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్టు.. ఏడుగురి రిమాండ్
కారు, 39 సెల్ ఫోన్లు స్వాధీనం: ఎస్పీ అపూర్వరావు విధాత: అర్ధరాత్రి వేళలో హైవేల పై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. గురువారం నిందితులను రిమాండ్ కి తరలిస్తున్న సందర్భంగా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల నుండి ఒక కారు, ఐదు లక్షల విలువైన 39 సెల్ ఫోన్లు, ఒక కత్తి, […]
- కారు, 39 సెల్ ఫోన్లు స్వాధీనం: ఎస్పీ అపూర్వరావు
విధాత: అర్ధరాత్రి వేళలో హైవేల పై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. గురువారం నిందితులను రిమాండ్ కి తరలిస్తున్న సందర్భంగా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
పట్టుబడిన నిందితుల నుండి ఒక కారు, ఐదు లక్షల విలువైన 39 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 9వ తేదీ రాత్రి దండెంపల్లి గోషాల వద్ద డిసిఎం ఆపి పడుకొని ఉన్న డ్రైవర్ను కారులో వచ్చి రాడ్తో కొట్టి గాయపర్చి ఒక సెల్ ఫోన్ 1500 రూపాయలు గుంజుకొని నిందితులు పారిపోయారు. నల్గొండ టు టౌన్ పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గురువారం ఉదయం పానగల్ బై పాస్ వద్ద టూ టౌన్ ఎస్ఐ, వారి సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా ఒక మారుతి సుజుకి ఎర్ట్రిగా కారు (TS-11-EU-7021) లోని వ్యక్తులు పోలీసు వారిని చూసి మిర్యాలగూడ వైపుకు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని చెక్ చేయగా కారులో ఉన్న రాడ్ , కత్తి, 39 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారించగా నిందితుల దారి దోపిడీలు వెలుగు చూశాయి.
నిందితులు మాదన్నపేట ఉబది అరవింద్, మాల్కు చెందిన కడమంచి గణేశ్, కరమంచి శ్రీహరి, గౌరేల్లి విఘ్నేష్, నిడమనూరు జంగాలగూడెం ఆలేటి వెంకటయ్యను, మరో ఇద్దరు మైనర్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితులు మార్చి 8న రాత్రి కారు కిరాయి తీసుకొని హైదరాబాద్ నుండి బయలుదేరి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఒక వ్యక్తి చిట్యాల వెళ్లేందుకు లిఫ్ట్ అడుగగా అతనిని ఎక్కించుకొని, దండుమైలారం గుడి దగ్గర రాగానే పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ నుంచి కంప చెట్ల లోనికి తీసుకొని వెళ్లి అతడిని కొట్టి అతని దగ్గర గల నగదు, సెల్ ఫోన్ లాక్కొన్నారు.
అక్కడి నుండి చౌటుప్పల్కి వచ్చి ఆగి ఉన్న లారీలో ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ను దొంగలించుకొని అక్కడి నుండి నారాయణ పూర్, మునుగోడ్ మీదుగా నల్గొండ రామగిరి మీదుగా పానగల్కు వచ్చి గ్రామ శివారులో రాత్రి గోశాల వద్ద ఆగి ఉన్న డిసిఎం డ్రైవరును, క్లీనర్ను కొట్టి అతడి దగ్గర ఫోన్, నగదు లాక్కొన్నారు. అక్కడి నుండి పానగల్ బై పాస్ రోడ్ మీదకు వచ్చి అక్కడ ఆగి ఉన్న డిసిఎం డ్రైవర్ ను కొట్టి నగదు, సెల్ ఫోన్ను లాక్కొని పరారయ్యారు.
కేసులో ప్రధాన నిందితుడు ఉబ్బని అరవింద్ నాలుగు కేసుల్లో, అతని అన్నగణేశ్ రెండు కేసులలో గతంలో జైలుకు పోయి వచ్చాడు. తిరిగి మద్యానికి బానిసై త్వరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో మరికొంతమంది తో కలిసి హైవేల పైన, యాదగిరి గుట్ట , హాయత్ నగర్ , ఎల్బి నగర్ , చౌటుప్పల్ , నార్కెట్పల్లి, నల్గొండ తదితర ప్రాంతాలలో దారి దోపిడీలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన నల్గొండ డిఎస్పి వి.నరసింహారెడ్డి, నల్గొండ టూ టౌన్ సిఐ డి.చంద్ర శేఖర్ రెడ్డి , నల్గొండ ట్రాఫిక్ సిఐ సి.శ్రీను, ఎస్ఐ లు ఎ. రాజశేఖర్ రెడ్డి, కే. భాస్కర్ రెడ్డి , కానిస్టేబుల్ లు శంకర్, బాలకోటి , గాంధీ , వెంకన్నలను జిల్లా ఎస్పి అభినందించారు.