విధాత: దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. షోయబ్ అనే ఫస్ట్క్లాస్ క్రికెటర్ సింద్ ప్రావిన్స్లోని హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంటర్ సిటీ చాంపియన్షిప్ను ప్లాన్ చేసింది.
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులను కోరింది. కాగా బోర్డులు కోచ్ల సలహా మేరకే ట్రయల్స్ను నిర్వహించి ఆపై జట్టును ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్ను కోచ్ కనీసం బౌలింగ్ ట్రయల్ కూడా తీసుకెళ్లలేదు. దీంతో హైదరాబాద్ జట్టులో షోయబ్ పేరు గల్లంతయింది.
ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్తాపం చెందిన షోయబ్ ఇంటికి వచ్చి బెడ్రూంకు వెళ్లి తలుపులు మూసుకున్నాడు. షోయబ్ కోపంగా రావడం చూసిన కుటుంబ సభ్యులు బెడ్రూంకు వెళ్లి చూసే లోపే షోయబ్ తన చేతిని బ్లేడ్తో పలుమార్లు కట్ చేసుకొని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అతని కుటుంబసభ్యులు స్పందించారు.
‘కోచ్ తనను బౌలింగ్ ట్రయల్స్ తీసుకెళ్లలేదని.. దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. మేం వెళ్లి చూసే లోపే చేతి కట్ చేసుకొని బాత్రూంలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం షోయబ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే పాకిస్తాన్ క్రికెట్లో ఇది కొత్తేం కాదు. ఇంతకముందు 2018లో అండర్-19 క్రికెటర్ మొహమ్మద్ జర్యాబ్ తనను జట్టులో నుంచి తీసేశారని ఉరేసుకొని ఆత్యహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.