ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం. హిందూ పురాణాల్లో సూర్య భగవానుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. తన భక్తులకు మంచి ఆరోగ్యం, ఆయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సును ఇస్తాడని నమ్మకం. ఆదివారం పొద్దున్నే సూర్య దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరి ఆదివారం నాడు సూర్య దేవుణ్ణి ఎలా పూజించాలో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో సిరిసంపదలతో పాటు గౌరవం, వైభవం పొందుతారని జోతిష్యులు చెబుతుంటారు. కానీ, సూర్యుడు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోక తప్పదని అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో సూర్యదేవున్ని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రోజున ఉపవాసం ఉండి సూర్యుడిని ఆరాధిస్తే మంచిది. సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెబుతారు. సూర్యునికి ఎర్రటి పువ్వులు సమర్పించడం చాలా మంచిది.
సూర్యదేవుణ్ణి ఎలా ప్రార్థించాలి?
ఆదివారం ఉదయాన్నే నిద్ర లేవాలి. వీలైతే సూర్యదయానికి ముందే నిద్ర లేస్తే మంచిది. అలా నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని.. శుభ్రమైన బట్టలు ధరించి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడానికి ఓ రాగి పాత్రలో నీటిని తీసుకొని.. అందులో నీరు, అక్షతలు, ఎర్రటి పూలు, బెల్లం కలపాలి. ఈ పదార్థాలన్నీ సూర్యదేవుడికి ప్రీతిపాత్రమైనవి.
అందువల్ల అర్ఘ్యం చేసే సమయంలో ఈ పదార్థాలన్నింటీని ఉంచే విధంగా చూసుకోవాలి. అలా చేయడం వల్ల సూర్యుడి ప్రభావం మీ జాతకంపై వెంటనే పడుతుందని నమ్మకం. సూర్యున్ని నమస్కరించే క్రమంలో రెండు చేతుల్లో నీటిని తీసుకొని.. సూర్యభగవానుడు చూసే విధంగా నీటిని వదిలేయాలి. అలా మూడు సార్లు చేయాలి. అలా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఆ నీటిని మీ పాదాలపై పడకుండా జాగ్రత్త వహించండి. అలా మీ కాళ్లపై పడకుండా.. నీరు పోసే చోట ఖాళీ గిన్నె లేదా ఏదైనా పాత్రను ఉంచాలి.