తిరుమల నుంచే ప్రక్షాళన.. శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు: సీఎం చంద్రబాబు

ఏపీలో ప్రజా పాలన ప్రారంభమైందని, ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కాబోతుందని ఏపీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - June 13, 2024 / 03:00 PM IST

వెంకన్న.. దుర్గమ్మ దర్శనం

విధాత, హైదరాబాద్: ఏపీలో ప్రజా పాలన ప్రారంభమైందని, ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కాబోతుందని ఏపీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఈ ఘన విజయం సాధించామని చెప్పారు. తిరుమల ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామని, టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. శ్రీ వేంకటేశ్వరస్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తుంటానని తెలిపారు. శ్రీవారికి ఆపచారం చేస్తే శిక్ష తప్పదని, గత పాలకులు తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభ్యమయ్యేలా చేశారని విమర్శించారు.

సంపద పెంచి పేదలకు పంచేలా పాలన

శ్రీవారి ఆశీస్సులతో ఆర్ధిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలని, నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాల్సివుందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయని, వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులు ఉండబోవన్నారు . 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి తాను సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేదని, ఆ తర్వాత ప్రక్షాళన చేసి సరికొత్త పాలన ప్రారంభించామన్నారు. వెంకన్న ఆశీస్సులతో ఏపీలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టించాలి.. దాన్ని పేదలకు పంచాల్సివుందన్నారు.

గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారని, రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు, పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇకపై ఉండవని, నేరస్థులను సహించేది లేదన్నారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని ఎనర్జీని రీచార్జ్ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. నా కుటుంబానికి నేనేమీ ఇవ్వాల్సిన అవసరం లేదని, రాజకీయాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో వారికి వ్యాపారం ఏర్పాటు చేశానని, ఇంతకు ముందు కుటుంబానికి సమయం కేటాయించలేదని, ఇప్పుడు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు.

వెంకన్న, దుర్గమ్మలకు మొక్కులు చెల్లించుకున్న బాబు

ఏపీ సీఎఈ చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అనంతరం చంద్రబాబు కుటుంబంతో కలిసి విజయవాడ ఇంద్రఖిలాద్రి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం తీర్ధప్రసాదాలు అందించారు.

Latest News