విధాత,అమరావతి: ప్రస్తుత పరిస్థితిలో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనంతోనే జనసేన ఉంటుందన్నారు. అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కరోనాతో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేశ్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెక్ను అందచేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారన్నారు.
కరోనా కారణంగా జనసైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున బీమా సౌకర్యం కల్పించామని, ప్రాణాలను పణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారని ఉద్వేగానికి గురయ్యారు. ఈ బీమా పథకానికి తన వంతుగా కోటి రూపాయలు ఇచ్చానని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుందన్నారు.