విధాత,హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సీబీఐ సుజనాచౌదరిపై 2019లో సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ 2019లో సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే, అమెరికాలో ఓ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందిందని, దానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
అత్యవసరంగా విచారణ జరపాలని సుజనా తరఫు న్యాయవాది కోరారు. అమెరికా నుంచి అందిన ఆహ్వానం వివరాలను సమర్పించకుండా అత్యవసరంగా విచారణ చేపట్టలేమన్న హైకోర్టు… విచారణ జులై 7కి వాయిదా వేసింది.
సుజనా చౌదరి డైరెక్టర్గా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ బ్యాంకులను మోసం చేసిందన్న సీబీఐ కేసులో నోటీసులపై హైకోర్టు విచారణ ముగించింది. గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు సుజనాచౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుజనా చౌదరిని విచారణ జరిపామని.. అవసరమైతే మళ్లీ పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ పేరుతో మళ్లీ మళ్లీ పిలిచే అవకాశం ఉందని సుజనా చౌదరి తరఫు న్యాయవాది వాదించారు. ఒక వేళ విచారణకు పిలిస్తే ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ నోటీసులు ఇస్తే, దానిపై అభ్యంతరాలుంటే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుజనా చౌదరికి సూచిస్తూ విచారణ ముగించింది.