కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కరోనా బారిన పడ్డ వారు రెండు డోసుల టీకా తీసుకున్నారు. కొందరైతే మూడు డోసుల టీకా కూడా తీసుకున్నారు. ఇక కరోనా టీకా వల్ల చాలా మంది గుండె జబ్బులతో పాటు ఇతర రోగాలకు గురయ్యారని వార్తలు వచ్చాయి. టీకా తీసుకున్న తర్వాతే హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
కానీ జర్మనీకి చెందిన ఓ 62 ఏండ్ల వృద్ధుడు మాత్రం 29 నెలల వ్యవధిలో 217 కొవిడ్ టీకాలు తీసుకున్నాడు. అతనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సంభవించలేదు. అసలు విషయం ఏంటంటే అతనికి కరోనా కూడా సోకలేదట. ఈ విషయం తెలుసుకున్న పరిశోధకులు ఆశ్చర్యపోయారు. దీంట్లో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. నిజంగానే ఆ వృద్ధుడు 9 నెలల వ్యవధిలో 130 సార్లు టీకా వేయించుకున్నట్లు రికార్డుల్లో నమోదైంది. వ్యక్తిగత కారణాలతోనే తాను 29 నెలల కాలంలో 217 సార్లు టీకా తీసుకున్నానని వృద్ధుడు చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ బేషుగ్గా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు.
పదేపదే టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మన్ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆయన ఎప్పుడూ కోవిడ్ బారినపడిన లక్షణాలను కూడా గుర్తించలేదు. ఇంకో విశేషమేమిటంటే ఇన్ని సార్లు టీకాలు తీసుకున్నా ఆ వ్యక్తి ఒక్కసారి కూడా జ్వరం బారిన పడలేదు.