ఇంట్లో ఉన్నప్పుడు కాలక్షేపం కోసం సాధారణంగా టీవీ ఛానెల్స్ వీక్షిస్తుంటాం. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది సినిమాలు, సీరియల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. ఇక కరోనా తగ్గిన కూడా సీరియల్స్తో పాటు టీవీ ప్రోగ్రాంస్కి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. అయితే ధరలతోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా టీవీ చానెళ్ల సంస్థలకు ఖర్చులు ఎక్కువయ్యాయి. వాటిని వినియోగదారులపై మోపేందుకు బ్రాడ్ కాస్టర్లు సిద్ధం అయినట్టు తెలుస్తుంది. దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఇటీవలి కాలంలో భారీగా స్పోర్ట్స్ ఈవెంట్స్ను ప్రసారం చేస్తున్న నెట్వర్క్ 18, వయాకామ్ 18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ వినియోగదారుల మీద ఛానెల్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ను 20 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ 9 నుంచి 10 శాతం, సోనీ నెట్వర్క్ 10-11 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక డిస్నీ స్టార్ మాత్రం ఎంత ఛార్జీ పెంచుతోందో వెల్లడించలేదు. ప్రతిపాదిత ఛార్జీల పెంపు మీద రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్లో ప్రచురించిన 30 రోజుల అనంతరమే పెరిగిన సబ్స్క్రిప్షన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బ్రాడ్కాస్టర్ల సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెరగనున్నాయి. మరి ఛార్జీలు పెరిగిన తర్వాత టీవీలకి ఆదరణ తగ్గుతుందా లేక పెరిగిన ఛార్జీలతోనే టీవీలకి అతుక్కుపోయి చూస్తారా అనేది రానున్న రోజులలో తెలియనుంది.మొబైల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ అయ్యేందుకు ఆప్షన్ ఉన్నా.. సరదాగా కుటుంబ సభ్యులతో కలసి సినిమాలు చూడాలంటే టీవీలోనే సాధ్యం కాబట్టి ఛార్జీలు పెరిగిన కూడా సబ్స్క్రిప్షన్ తప్పక తీసుకుంటారని తెలుస్తుంది. టీవీల్లో సీరియల్స్, క్రికెట్ మ్యాచ్లు, వార్తలు చూడటం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లను ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేసుకోవడం ఎక్కువైనప్పటికీ టీవీలు చూసే వారి సంఖ్య మాత్రం ఏమి తగ్గలేదు.