Site icon vidhaatha

500 రోజులు ఆడి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

ఒకప్పుడు సినిమా హిట్, ఫ‌ట్ అనేది చిత్రం ఎన్ని రోజుల పాటు ఆడింది అనే దానిపై నిర్ణ‌యించేవారు. ఇప్పుడు అయితే సినిమా వారం రోజుల‌కే థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్ప‌ట్లో మాత్రం కొన్ని చిత్రాలు వంద రోజులు, 175 రోజులు, రెండు వంద‌ల రోజులు, మూడు వంద‌లు కూడా ఆడేవి. అయితే ఓ తెలుగు చిత్రం ఏకంగా 500 రోజుల పాటు ఆడి అంద‌రికి చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మ‌రి ఆ చిత్రం ఏంట‌నే క‌దా మీ డౌట్.. సీనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ల‌వ‌కుశ‌. ఇందులో నందమూరి ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించ‌గా, సీత‌గా అంజ‌లీ దేవి నటించారు.

చిత్రంలో ల‌వ‌కుశులుగా ఇద్ద‌రు బాల న‌టులు అద్భుతంగా న‌టించారు. 1963 మార్చి 29న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా ను చూసేందుకు ఊర్ల నుండి ఎడ్లబండ్లపై థియేటర్లకు వేళ్లేవాళ్లట‌. అయితే ఈ చిత్రం ప‌లు రికార్డ్స్ న‌మోదు చేయ‌గా, అందులో ఒక రికార్డ్‌ని ఏ మూవీ కూడా బ్రేక్ చేయ‌లేక‌పోయింది. ఎన్టీఆర్ న‌టించి పాతాళ భైరవి 245 రోజులు ఆడ‌గా, దానిని బ్రేక్ చేసిన ల‌వ‌కుశ చిత్రం ఏకంగా 500 రోజుల పాటు థియేట‌ర్‌లో సంద‌డి చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమా అన్ని రోజులు ఆడి దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ట‌.

తెలుగుతో పాటు తమిళంలోనూ లవకుశ రికార్డు రాసింది. అక్కడ ఏకంగా 40 వారాలు ప్రదర్శించారు. హిందీలో 25 వారాలు నడవడంతో ఎన్టీఆర్ అప్ప‌ట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇది తొలి తెలుగు క‌ల‌ర్ చిత్రం కావ‌డంతో ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్పాలి. చిత్రంలో లక్హణ్ గా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రఘ్ణుడిగా శోభన్ బాబు, లవుడుగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. ఆర్థిక కారణాలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్.రావు పునఃప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ సినిమాలో సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు, అంజలీదేవి పాత్రల‌కి బాగా కనెక్ట్ అయిన ఆడియ‌న్స్ వారిని నిజమైన సీతారాముల్లానే భావించి హారతులు పట్టేవారు

Exit mobile version