బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సక్సెస్ ఫుల్గా 14వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఒకే ఒక్కవారం మిగిలి ఉండగా, ఈ ఆదివారం విజేతలు ఎవరో తెలిసిపోతుంది. అయితే తాజా ఎపిసోడ్లో నాగార్జున స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి మొట్ట మొదట ప్రియాంకని రెండో ఫైనలిస్ట్గా ప్రకటించాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మధ్య మధ్యలో ఫన్నీ గేమ్ ఆడిస్తూ ఒక్కో ఫైనలిస్ట్ని రివీల్ చేస్తూ వచ్చాడు. ప్రియాంక తర్వాత యావర్, అమర్ దీప్ ఫైనలిస్టులుగా నిలిచారు. ఇక నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి హౌస్ లో తమకి బాధకలిగించిన వారం ఏంటి అని ప్రశ్నించగా, ముందుగా అర్జున్ 13వ వారం అని చెప్పాడు. ప్రియాంక 9 అని, యావర్ ఓ నాలుగు వారాలలో తనకు బాధ కలిగిందని,ఇలా పలువురు తమకు బాధ కలిగిన వారాలు చెప్పుకొచ్చారు.
అనంతరం సోషల్ మీడియాలో ఇంటి సభ్యుల గురించి పేలుతున్న మీమ్స్ ప్లే చేశారు నాగార్జున. మీమ్స్ చూసుకుని కంటెస్టెంట్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అనంతరం బిగ్ బాస్ వేదికపైకి ఆస్కార్ విజేత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బిగ్ బాస వేదిక మీద నుండి చిత్రంలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.. ఈ ఎక్స్పీరియన్స్ తనకి కొత్తగా ఉందని అన్నారు. ఇక అనంతరం నాగార్జున హౌజ్లోని ఒక్కో కంటెస్టెంట్ ని కీరవాణికి పరిచయం చేశారు. మరో ఫైనలిస్ట్ ని రివీల్ చేసే భాద్యత నాగార్జున కీరవాణికి అప్పగించారు. ఆయన పల్లవి ప్రశాంత్ని మరో ఫైనలిస్ట్గా ప్రకటించారు.
ఇక చివరిగా శోభా శెట్టి, శివాజీ మాత్రమే ఉండగా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అన్నారు.. ఉత్కంఠతో కూడుకున్న ఒక గేమ్ లో ముందుగా ఎవరి టికెట్ పూర్తయితే వాళ్ళు ఫైనల్ కి చేరుతారు. మరొకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పగా, ముందుగా నాగ్ చెప్పిన నెంబర్స్ ప్రకారం శివాజీ టికెట్ ముందుగా పూర్తి అవుతుంది. దీనితో శివాజీ ఫైనలిస్ట్ గా నిలవగా.. శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. హౌజ్లో నుండి బయటకు ధైర్యంగానే వచ్చిన శోభా శెట్టి స్టేజ్పైన తన ఏవీ చూసుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చంది. వేదికపై కుప్పకూలింది కూడా. మళ్లీ కాస్త ధైర్యం తెచ్చుకొని హౌజ్మేట్స్తో మాట్లాడి వెళ్లి పోయింది. ఇక ఈ సీజన్లో ఆరుగురు ఫైనలిస్ట్లుగా ఉండగా, ఎవరు విజేత అవుతారనేది ఇప్పుడు అంతా ఆసక్తికరంగా మారింది.