Parineeti Chopra – Raghav Chadha Marriage | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. గతకొంతకాలంగా పీకలోతు ప్రేమలో జంట ఇటీవల ఢిల్లీలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహ వేడుక ఆదివారం జరుగనుండగా.. ఉదయ్పూర్లో పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కోసం పరిణీతి, రాఘవ్ చద్దా కుటుంబం శుక్రవారమే ఉదయ్పూర్కు చేరుకున్నారు. రాఘవ్ కుటుంబం తాజ్ లేక్ ప్యాలెస్లో, పరిణీతి కుటుంబం హోటల్ లీలా ప్యాలెస్లో విడిది చేశారు. సాయంత్రం లీలా ప్యాలెస్లోని శీష్మహల్లో ఇరు కుటుంబాలు విందు చేశాయి. మరో వైపు పెళ్లి వేడుకలు శనివారం మొదలవనున్నాయి. అయితే, మెహందీ, తదితర కార్యక్రమాలు శనివారమే జరుగనున్నాయి. హోటల్ లీలా ప్యాసెల్ అత్యంత ఖరీదైన గదిలో పరిణీతి చోప్రా చురా (గాజులు ధరించే) వేడుక జరుగనున్నది. ఈ గది అద్దెనే దాదాపు రూ.10లక్షలు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా ఆర్డర్ మేరకు వింటేజ్ కారును సైతం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అలంకరించనున్నారు. రాఘవ్ ఇదే కారులో వేడుక వద్దకు రానున్నారు.
లంచ్, డిన్నర్ థీమ్ ఇదీ..
పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం ఇవ్వనున్న లంచ్, డిన్నర్ ప్రత్యేకంగా థీమ్ ఉన్నది. దీనికి ‘ప్యార్ కా ఖానా’ థీమ్తో లంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగే డిన్నర్ పార్టీ థీమ్ను ‘లెట్స్ పార్టీ లైక్ ఇట్స్ ది 90’ పేరుతో జరుగనున్నది. పెళ్లి కోసం ఆదివారం పిచోలా సరసులో ఉన్న హోటల్ తాజ్ లేక్ ప్యాసెల్ నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్ లీలా ప్యాసెల్కు రాఘవ్ చద్దా పడవల ఊరేగింపు ద్వారా కల్యాణ వేదికకు చేరుకుంటారు. రాఘవ్ ఊరేగింపులో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన హాజరుకానున్నారు. అలాగే బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ సైతం పాల్గొననున్నారు. అయితే, పెళ్లికి పరిణీతి చోప్రా అక్క అయిన హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రాకపై సస్పెన్స్ కొనసాగుతుంది.
అతిథులకు 180 లగ్జరీ వాహనాలు
పరిణీతి – రాఘవ్ చద్దా వివాహానికి హాజరయ్యే అతిథులకు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాయల్ మ్యారేజ్కి వచ్చే అతిథులకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలుకున్నారు. పంజాబ్కు చెందిన కళాకారులు ఇక్కడ అతిథులకు స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా అతిథులను విమానాశ్రయం నుంచి హోటల్కు తరలించేందుకు 180 లగ్జరీ వాహనాల కాన్వాయ్ను సిద్ధం చేశారు. ఇందులో ఇన్నోవా, బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అతిథులకు పలు రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. మెనూలో ప్రత్యేకంగా రాజస్థానీ, పంజాబీ వంటకాలను ఉండనున్నాయి. దాల్-బాటీ చుర్మేతో పాటు మేవార్ ప్రత్యేక ధోక్లా సైతం అతిథులకు అందించనున్నారు. అలాగే ఇటాలియన్, ఫ్రెంచ్ వంటకాలు సైతం అతిథులకు రుచి చూపించనున్నారు.