విధాత : నటుడు విశాల్ బ్రహ్మ రూ.40కోట్ల విలువైన డ్రగ్స్ తో పట్టుబడ్డారు. చెన్నై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.40 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా వెనుక నైజీరియా ముఠా ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో నటించారు. సినీ అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక సమస్యల నేపధ్యంలో మిత్రుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయమై నేరాల బాట పట్టాడని గుర్తించారు.
ఖర్చులు అన్ని తామే చెల్లిస్తామంటూ విశాల్ మ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని, భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని వారు ఆశ చూపినట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నైకి విమాన ప్రయాణం …చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్టు దర్యాప్తు వర్గాల కథనం. నైజీరియా ముఠా సూచనలతో రెండు వారాల క్రితం విశాల్ బ్రహ్మ ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడని, తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతడికి డ్రగ్స్ తో కూడిన ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని సమాచారం.