Election Results 2024| కాలం మారుతుంది, పరిస్థితులకి తగ్గట్టుగా అన్నీ మారుతూ పోతుండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు థియేటర్స్లో సినిమాలు మాత్రమే ప్రదర్శించేవాళ్లు. కాని ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్లు ప్రసారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి ఎన్నికల రిజల్ట్స్ ప్రసారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం అంతటా ఎన్నికల హంగామా కొనసాగుతుంది. నెలరోజుల క్రితం ఎన్నికల హంగామా మొదలు కాగా ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. (శనివారం)జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుండగా, దాంతో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తవుతాయి. అయితే ఈ ఎన్నికలలో వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఓ ప్రాంతంలోని థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ప్రజలు ఈ అనుభూతిని మరింతగా ఆస్వాదించడానికి, సినిమా థియేటర్ యజమానులు కౌంటింగ్ ప్రక్రియను పెద్ద స్క్రీన్పై ప్రత్యక్షంగా ప్రదర్శించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఏర్పాట్లు చేయగా, టికెట్ బుకింగ్లను కూడా ఆయా థియేటర్లు ప్రారంభించాయి. ముంబైలోని ఎస్ఎం5 కల్యాణ్, సియాన్.. కంజూర్మార్గ్లోని మూవీమ్యాక్స్ థియేటర్లు.. థానేని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్.. నాగ్పుర్లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు బిగ్ స్క్రీన్పై ఎన్నికల ఫలితాలని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఇప్పటికే పేటీఎం వంటి ప్లాట్ఫామ్లలో బుకింగ్స్ను ప్రారంభించగా, చాలా మంది టిక్కెట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను 6 గంటల పాటు థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనుండగా, ఇది చూసేందుకు కెట్ ధరలను రూ.99 నుంచి రూ.300 వరకు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో హాజ్ఫుల్ బోర్డ్లు కూడా పెట్టినట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే ట్రెండ్ని అనుసరించే అవకాశం ఉంది. అయితే, లైసెన్సింగ్ సమస్యల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్క్రీనింగ్లు సాధ్యం కాదు కాబట్టి ఈ అవకాశం తెలుగు రాష్ర ప్రజలకి అయితే లేదనే చెప్పాలి.