Rajamouli| ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడని రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించాడు. ప్రతి సినిమా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయి ఖండాంతరాలు దాటగా, ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుండగా, ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం పక్కా అని అంటున్నారు.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ లో మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీలో భాగంగా రాజమౌళితో పాటు ఆయన సన్నిహితులు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజమౌళి ఓ ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకున్నాడు. మగధీర షూటింగ్ సమయంలో మాకు యాక్సిడెంట్ అయిందని, తన భార్య రమకి పెద్ద గాయం కావడంతో నడుము కింద స్పర్శ కూడా పోయిందని చెప్పాడు.. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేకపోవడంతో తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేస్తూ నా భార్యని చూస్తూ చాలా ఏడ్చేసాను అని ఆయన అన్నారు.
ఇక రమా రాజమౌళి మాట్లాడుతూ..మొదటిసారి మా అక్క పెళ్లిలో ఆయనని చూసాను. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. అయితే రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు ఉండడంతో అతని ప్రపోజల్కి ఓకే చెప్పలేదు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం అని రమా రాజమౌళి పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి.