Vijay Sethupathi| మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరచియాలు అక్కర్లేదు. పలు భాషలలో నటించి ఎంతగానో అలరించాడు. కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం హీరోయిజం చిత్రాలు మాత్రమే చేయకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. హీరోగా, ప్రతి నాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన విజయ్ సేతుపతి మాహారాజా అంటూ తన కెరీర్ లోనే 50వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ్ సినీ పరిశ్రమలోని స్టార్స్ ఎవరితోనైనా కలిసి పనిచేయాలనుకుంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా, తాను అలాంటి సినిమాలతో విసిగిపోయాను. అలాంటి వాటితో నాకు కొన్ని మంచి, మరిన్ని చెడు అనుభవాలు ఎదురయ్యాయి. స్టార్ హీరోలతో కలిసి సినిమా చేసినప్పుడు ఏ పాత్ర చేస్తామో మనకి ముందే తెలుస్తుంది. అయితే మనం ఆ పాత్రలో ఎంత బాగా నటించిన కూడా అనుకున్న పేరు రావడం లేదు. సినిమా కోసం ఆ హీరోతో సమానంగా కష్టపడినా.. ఆ కష్టాన్ని ఎవరూ గుర్తించరు” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. అలాగే ఇకపై తాను విలన్ పాత్రలలో నటించనని అన్నారు.
విలన్ పాత్రలు, అతిథి పాత్రలు కూడా తాను చేయనంటూ చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి. ఇక కృతి శెట్టితో చేయడంపై స్పందించిన విజయ్ సేతుపతి.. “డీఎస్పీ అనే చిత్రంలో కృతి శెట్టిన హీరోయిన్గా తీసుకుంటా అని నాతో చెప్పారు. అలా చేస్తే నేను హీరోగా చేయను అని ఆ మూవీ టీమ్కి చెప్పాను. అందుకు కారణం ఉప్పెన చిత్రంలో కృతికి తండ్రిగా నేను నటించాను. ఆ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించేటప్పుడు కృతి కాస్త కంగారు పడింది. అప్పుడు “నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు” అని ధైర్యం చెప్పాను. అలా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేను, జోడీగా కూడా చేయలేనని విజయ్ సేతుపతి తెలియజేశాడు.