గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమార్తెను ప్రేమించాడనే ఆగ్రహంతో వెంకటేశ్ అనే యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా నరికి చంపారు. మరో ఐదుగురితో కలిసి యువతి తండ్రి యువకుడి కాళ్లూచేతులు నరికాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు కలిసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంకటేశ్ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు.
అప్పటి నుంచి గ్రామానికి దూరంగా ఉంటున్న వెంకటేశ్.. యువతితో మాత్రం తరచూ ఫోన్లో సంభాషిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో యువకుడిని గత రాత్రి నమ్మకంగా గ్రామానికి పిలిపించారు. మాట్లాడాలంటూ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతి తండ్రి భాస్కర్ రావు, మరో ఐదుగురు కలిసి వెంకటేశ్పై మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. దాడికి పాల్పడ్డ ఆరుగురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్ బాబు తెలిపారు.