Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు, సిబ్బంది కారణంగా తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. 15న తిరుప్పావడతోపాటు 15 నుంచి 17 వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.