BigBasket Online Fraud | బిగ్ బాస్కెట్ పేరుతో ఆన్‌లైన్ మోసం

బిగ్ బాస్కెట్ పేరుతో వచ్చిన ఫేక్ ఆఫర్ లింక్‌ను క్లిక్ చేసి ఏపీకే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో యూసఫ్‌గూడ వ్యక్తి రూ.1.97 లక్షలు పోగొట్టుకున్నారు. కాల్ ఫార్వార్డింగ్ ద్వారా మోసం జరిగినట్లు గుర్తించారు.

BigBasket Online Fraud Hyderabad

విధాత : బిగ్ బాస్కెట్ పేరుతో ఆన్ లైన్ మోసం కలకలం రేపింది. యూసఫ్ గూడకు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో బిగ్ బాస్కెట్ పేరుతో ఉన్న నంబర్‌ నుంచి సందేశం వచ్చింది. ఫెస్టివల్ ఆఫర్ పేరుతో వచ్చిన సందేశంలో తక్కువ ధరలో కిరాణా సరుకులు అందిస్తున్నట్లు లింక్ పంపించారు. ఆ ఆఫర్‌లు చూసి ఆకర్షితుడైన వ్యక్తి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా బిగ్ బాస్కెట్ డిస్కౌంట్ యాప్ అనే ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయమని సూచన వచ్చింది. ఆర్డర్ కన్ఫర్మ్ కావాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేయాలి అనే మెసేజ్‌ రావడంతో అతను ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో కొన్ని నిమిషాల్లోనే అతని మొబైల్ ఫోన్‌ పూర్తిగా హ్యాక్ అయింది. అతని క్రెడిట్ కార్డు నుంచి ఓటీపీ ఇవ్వకుండానే.. రూ.1.97 లక్షలు వరుసగా డెబిట్ అయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన ట్రాన్సాక్షన్ అలర్ట్స్ చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించగా, మీ ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి..ఓటీపీలు మోసగాళ్లకు చేరిపోవడంతో మోసం జరిగిందని తెలిపారు. వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూసుఫ్‌గూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్లు హర్యానా, ఢిల్లీలోని ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా పని చేస్తున్నట్లు గుర్తించారు.

ఏపీకే యాప్ తో గాలం..కాల్ ఫార్వర్టింగ్ తో మోసం

ఏపీకే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే, యూజర్ ఫోన్‌లో ఉన్న కాల్ సెట్టింగ్స్‌లో మార్పులు జరిగి, కాల్ ఫార్వార్డింగ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యేలా సైబర్ నేరగాళ్లు చేసిన సెటప్ తో బ్యాంక్‌ నుంచి వచ్చే ఓటీపీ, వెరిఫికేషన్ కాల్స్ అన్నీ నేరుగా మోసగాళ్ల ఫోన్‌కు వెళ్లిపోతాయని పోలీసులు గుర్తించారు. ఈ కొత్తరకం మోసాన్ని రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ద్వారా చేసినట్లుగా గుర్తించారు. ఈ యాప్‌ ఇన్‌స్టాల్ అయిన వెంటనే మోసగాళ్లు బాధితుడి మొబైల్‌ను పూర్తిగా కంట్రోల్ చేసి.. కేవలం ఓటీపీ కాకుండా, గ్యాలరీ, కాంటాక్ట్స్, మెసేజ్ లు కూడా వారికి యాక్సెస్ అయ్యాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు నగరంలో 4,500కి పైగా ఆన్‌లైన్ మోసాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 శాతం కేసులు ఫేక్ ఆఫర్ల పేరుతోనే జరిగినవేనని అధికారులు చెబుతున్నారు.