Oil Tanker Capsize : గల్ఫ్ దేశమైన ఒమన్ సముద్ర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొమొరోస్ జెండాతో వెళ్తున్న ఓ చమురు ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది నౌకా సిబ్బంది గల్లంతు అయ్యారు. వారిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక జాతీయులు ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్ (Prestige Falcon) గా గుర్తించారు.
పోర్టు టౌన్ దుకమ్కు సమీపంలోని రాస్ మద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొన్నది. ఆయిల్ ట్యాంకర్ ముగినిపోవడానికి కారణాలు ఇంకా వెల్లడించలేదు. ఘటన జరిగిన సమయంలో ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఒమన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఓడ మునిగిపోయి తలకిందులైందని చెప్పారు. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకయ్యాయా.. లేదా..? అనే విషయాన్ని ధ్రువీకరించలేదు.