Pushpa2:ప్రస్తుతం టాలీవుడ్తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు పుష్ప2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పుష్ప చిత్రం మంచి విజయం సాధించడంతో పుష్ప2 మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందరి అంచనాలకి తగ్గట్టుగానే సుకుమార్ ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక టీజర్లో తిరుపతి గంగమ్మ సన్నివేశాలని చూపించినట్టు అర్ధమవుతుంది. అయితే ఈ సన్నివేశం అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరిగింది. చిత్రానికి ఇది కీలకమైన సన్నివేశం కాబట్టి వందలాది ఆర్టిస్ట్లు పాల్గొన్నారు.
ఇక ప్రత్యేక మేకప్, లైటింగ్ సెటప్లు, భారీ సెట్లు ఇలా ప్రతిదానికీ భారీగానే ఖర్చు చేశారట నిర్మాతలు. గంగమ్మ జాతర సందర్భంగా వచ్చే పాట, సన్నివేశం పుష్ప-2 సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉంటాయని, ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ ఆరు నిమిషాల సన్నివేశానికి అయిన ఖర్చు అక్షరాలా 60 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. ఈ సన్నివేశానికి ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు ముంబై నుంచి ఖరీదైన కెమెరాలను సైతం తెప్పించినట్టు తెలుస్తుంది. అయితే అంత ఖర్చు చేశారు కాబట్టి సన్నివేశం అంత రిచ్గా వచ్చిందని అర్ధమవుతుంది. సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.
గతంలో పుష్ప-2 కు సంబంధించి విడుదల తేదీ విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. కాని వాటన్నింటికి చెక్ పెడుతూ ఇటీవల టీజర్లోను ఆగస్ట్ 15న మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. పుష్ప2 విడుదలైన తర్వాత పుష్ప3ని కూడా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. మొత్తానికి పుష్ప2తో ప్రభంజనాలు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. అయితే తెలుగు పరిశ్రమమే కాదు.. దక్షిణాది ప్రాంతానికి చెందిన చిత్ర పరిశ్రమలు.. ఉత్తర భారతదేశానికి చెందిన హిందీ చిత్ర పరిశ్రమ కూడా ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇందులో బన్నీ సరసన రష్మిక మంధాన కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.