ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగిన చిరు అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే చిరంజీవి తన సినిమాలతో కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా చాలా మంది మనసులు గెలుచుకున్నారు.
చిరంజీవి తొలిసారి 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దాంతో పాటు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ కూడా స్తాపించారు. దీని ద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంక్ చాలా పెద్దది కాగా, దానిని గాంధీ జయంతి రోజు ప్రారంభించడం విశేషం.
నేటితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి పాతికేళ్లు అయిన సందర్భంగా చిరు తన ఇన్స్టాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ రోజు మనదేశానికి చాలా ముఖ్యమైన రోజు. ఇక నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) ప్రారంభించి కూడా 25 సంవత్సరాలు పూర్తైంది. అద్భుతమైన ప్రయాణం ట్రస్ట్ పై ప్రేమను ప్రతిబింబిస్తోంది.
ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి పేదలకు అందించాం. అలానే కంటి పంపిణీ ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపు తిరిగి వచ్చేలా చేశాము. ఇక కరోనా మహమ్మారిలో వేలాది మంది ప్రాణాలు రక్షించాం. దాంతో పాటు మరెన్నో సేవలు అందించాము అని చిరంజీవి స్పష్టం చేశారు.
మన తోటి వారికి సేవ చేయడంలో పొందే ఆనందం అంతా ఇంతా కాదు. సీసీటీ మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్కు శక్తినిచ్చిన లక్షలాది మంది ఉదార సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను! ఇది మన దేశానికి చేస్తున్న సహకారం! ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి అంటూ చిరంజీవి తన పోస్ట్లో ఎమోషనల్ కామెంట్ పెట్టారు.
అంతేకాక తాను బ్లడ్ ఇస్తున్న పిక్ కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం చిరంజీవి పోస్ట్పై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇక చిరంజీవి ఇప్పుడు పలు కథలు వింటున్నట్టు తెలుస్తుండగా, త్వరలోనే ఆయన తదుపరి సినిమా షూటింగ్కి సంబంధించిన ప్రకటన రానుంది.