విధాత : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) ఇక లేరు. గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజు శ్రీవాస్తవ ఈ ఏడాది ఆగస్టు 10న జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అదే రోజు రాజుకు యాంజియోప్లాస్టీ చికిత్స నిర్వహించారు. కొద్ది రోజుల వరకు బాగానే ఉన్న రాజు.. తర్వాత కోమాలోకి వెళ్లారు. శ్రీవాస్తవకు చికిత్స అందించిన వైద్యుల బృందం ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
ఆయన అభిమానులు సైతం శ్రీవాస్తవ తిరిగి రావాలాని ఆకాంక్షించారు. రాత్రిపగలు పూజలు చేసి దేవుడిని ప్రార్థించారు. అయినప్పటికీ వైద్యుల కృషి గానీ, అభిమానుల పూజలు గానీ ఆయన ప్రాణాలను నిలుపలేకపోయాయి. చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడుకు ఆక్సీజన్ అందలేదు. మెదడు పైభాగానికి ఆక్సీజన్ అందలేదని, ఫలితంగా శ్రీవాస్తవ స్పృహలోకి రాలేదని వెల్లడించారు వైద్యులు. చివరకు ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడివెళ్లారు.
రాజు శ్రీవాస్తవ సినీ ఇండస్ట్రీలోకి 1980లో ప్రవేశించారు. 2005 వరకు ఆయనకు పెద్ద గుర్తింపు రాలేదు. 2005 తర్వాత స్టాండప్ కమెడీ షో.. ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్లో పాల్గొన్న తర్వాత అతనికి మంచి గుర్తింపు వచ్చింది. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా, అమ్దానీ అత్తానీ రచ్చా రూపాయియా వంటి హిందీ చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్లో రాజు ఒకరు. ఇక ఉత్తరప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగారు.