విధాత, సినిమా: విషాదాంతమైన కథలతోనే ఎంటర్టైన్మెంట్ను రంగరించి చూపించే కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆ మధ్యన రాజేంద్రప్రసాద్ హీరోగా మీ శ్రేయోభిలాషి అనే చిత్రం వచ్చింది. ఇన్నాళ్ల తర్వాత వెంకీ కుడుముల అలాంటి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
చలో చిత్రంతో దర్శకుడిగా మారి భీష్మతో మంచి హిట్ను సాధించిన వెంకీ కుడుములకు ఎంటర్టైన్మెంట్ పండించడంలో సపరేటు రూట్. కాగా ఆయన త్వరలోనే నితిన్తో ఓ చిత్రం చేయబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవితో చిత్రం డైలామాలో పడడంతో ఆ సమయంలో తనకు అచ్చొచ్చిన నితిన్తో ఓ చిత్రం పూర్తి చేసి మరలా తనేమిటో ప్రూవ్ చేసుకోవాలని వెంకీ కుడుముల పట్టుదలగా ఉన్నాడు.
అయితే ఈ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం చిత్రం తరహాలో సాగుతుందట. అంటే ఓ ప్రాణాంతక వ్యాధి వలన కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలిసిన వ్యక్తి ఎలాంటి మానసిక ఘర్షణ అనుభవించాడు? తాను బతికినన్ని రోజులను ఎలా బతకాలని డిజైన్ చేసుకున్నాడు? నవ్వుతూనే బతుకుతూ ఎలా వినోదం పండించాడు? తనపై సానుభూతి చూపిన వారికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉంటుంది? తాను బతికున్న కొద్ది రోజులు పాటు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఎలా లైఫ్ ని లీడ్ చేశాడనే పాయింట్ చుట్టూ ఈ చిత్రం సాగుతుందని సమాచారం.
మరి ఇలాంటి సబ్జెక్టును ఎంచుకుని వెంకీ కుడుముల నితిన్తో ఎలాంటి హిట్టును అందిస్తాడు వేచి చూడాలి. మొత్తానికి ఎలాగైనా ఈ చిత్రంతో తన సత్తా చాటాలని, ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాలని వెంకీ కుడుముల చాలా పట్టుదలగా ఉన్నాడని సమాచారం. చిరంజీవితోసినిమా చేతుల దాకా వచ్చి పెండింగ్లో పడడంతో ఈ చిత్రంతో ఎలాగైనా తన సత్తా చూపించాలని వెంకీ పట్టుదలతో ఉన్నాడని సమాచారం.