వాణి తమిళనాడులోని వెల్లూరులో 1945, నవంబర్ 30వ తేదీన జన్మించారు. వాణి జయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లల్లో వాణి జయరాం ఐదో సంతానం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి.. ఇలా 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు ఆలపించారు. అలా సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వాణి జయరాం.
కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టింది. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చక్కగా పాడేవారు. తనకు 8 ఏండ్ల వయసు ఉన్నప్పుడే సంగీత కచేరీలు నిర్వహించి, పలువురి ప్రశంసలు అందుకుంది. మద్రాస్ క్వీన్స్ మేరీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.
శనివారం ఇంట్లో ఒక్కరే ఉన్న సమయంలో కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఆమె చాలా సేపు స్పృహలో లేరు. పని మనిషి వచ్చి డోర్ కొట్టినా ఎంతకు తెరియక పోవడంతో తలుపులు బద్దలు గొట్టి వాణీ జయరాంను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గతంలోనే భర్త చనిపోవడంతో వాణీ జయరాం ఒక్కరే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖంపై ఎవరో కొట్టినట్లు దెబ్బలు ఉన్నాయని పని మనిషి చెబుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐతే గడిచిన నాలుగు రోజులుగా ఆమె ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.