Site icon vidhaatha

Avinash Reddy | చేతులెత్తేసిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ అరెస్ట్ తప్పదా..?

విధాత‌: వైఎస్‌ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టేసింది. దీనితో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తన బాబాయ్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందా.. అరెస్ట్ ముప్పు ఉందా.? చూస్తుంటే సీన్ అలాగే ఉంది. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో (Telangana High court) ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా.. అంతే అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

అవినాష్ రెడ్డికి (MP Avinash Reddy) తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి (CBI)అనుమతిస్తూ.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టం చేస్తూ.. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

పిటిషన్లో అవినాష్ ఏం కోరారంటే..

ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని, తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి వారం క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాకుండా తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల ద్వారా రికార్డు చేయకపోవడాన్ని సవాలు చేశారు.

జనవరి 28, ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్ పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు.

విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సీఎం జగన్( CM YS Jagan Mohan ReddY) ఈరోజు ఢిల్లోలో ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ను కలుస్తున్నారు. అవినాష్ కేసు విషయాన్నీ అక్కడ ప్రస్తావిస్తారా.. దర్యాప్తు తీరును ప్రభావితం చేస్తారా.. తనకు సోదరుడు అయ్యే అవినాష్ ను కాపాడతారా అనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version