Ancient tomb | 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి.. దాంట్లో భారీగా బంగారం, విలువైన వస్తువులు..!

  • Publish Date - March 12, 2024 / 03:40 AM IST

Panama : మధ్య, దక్షిణ అమెరికాల సరిహద్దుల్లోని రిపబ్లిక్‌ ఆఫ్‌ పనామాలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు వెలుగులోకి వచ్చాయి. దాంతో పురాతత్వ శాస్త్రవేత్తలే షాక్‌కి గురయ్యారు. పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలోగల ఎల్‌కానో ఆర్కియాలాజికల్‌ పార్క్‌ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఈ నిధి బయటపడింది.

ఈ భారీ పురాతన సమాధిలో పెద్దఎత్తున బంగారు నిధితోపాటు చాలా మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది అమెరికాలోకి యూరోపియన్‌ల రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోందని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సంస్కృతిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఆ సమాధిలో లభ్యమైన వస్తువుల వివరాలను అక్కడి పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జూలియా మాయో వెల్లడించారు. ఆ సమాధిలో బంగారు శాలువా, బంగారు బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవి పోగులు, ఇంకా ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని ఆయన తెలిపారు.

అంతేగాక సమాధిలో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు మాయో పేర్కొన్నారు. ఆ సమాధి కోకల్‌ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నట్లు తెలిపారు. నాటి ఆచారం ప్రకారం ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని వారు అంచనా వేస్తున్నారు. అయితే సమాధి చేయబడ్డ ఆ వ్యక్తుల సంఖ్య కచ్చితంగా ఎంత అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని మాయో వెల్లడించారు.

Latest News