Vande Bharat | వందే భారత్ రైళ్లకు డిమాండ్ ఉండడంతో రైల్వేశాఖ మరిన్ని కొత్త మార్గాల్లో రైళ్లను తీసుకువస్తున్నది. ఆంధప్రదేశ్లో మరో వందే భారత్ రైలు కూతపెట్టనున్నది. విజయవాడ – చెన్నై మధ్య భారతీయ రైల్వేశాఖ రైలును ప్రారంభించనున్నది. ఈ నెల 7 నుంచి రైలు ప్రారంభంకానున్నది. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 5 కొత్త వందే భారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ – చెన్నై మధ్య నడిచే రైలు సైతం ఉంటుందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు సమాచారం అందింది.
అధికారులు ఇప్పటికే ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 8న నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో స్టాప్స్ ఉంటాయని, రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్, టికెట్ ధరలు నేడో రేపో ప్రకటించనున్నారు. ఈ రైలును రేణిగుంట మీదుగా నడుపాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారని, అందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నైకి వెళ్తుంది.
విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్ను రేణిగుంట మీదగా నడపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం విజయవాడ – చెన్నై మధ్య ఉన్న ఇంటర్ సిటీ రైలు ఆరున్నర గంటల్లో చెన్నై చేరుతోంది. కనిష్ట ప్రయాణ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. విశాఖపట్నం – హైదరాబాద్ – విశాఖపట్నం, హైదరాబాద్ – తిరుపతి – హైదరాబాద్ మధ్య నడుస్తుండగా.. ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉన్నది.