జగన్ ఒక నియంత.. వైఎస్సార్ పేరును చెడగొట్టారు

‘వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు.

  • Publish Date - January 25, 2024 / 10:58 AM IST

  • నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలనూ ముంచారు
  • మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?
  • పార్టీని, ప్రభుత్వాన్ని బీజేపీకి తాకట్టుపెట్టారు..
  • వైఎస్ఆర్ కుటుంబం చీలేందుకు జగనే కారణం
  • కాకినాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు


విధాత, కాకినాడ: ‘వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. ప్రజలకు కనపడరు.. ఎమ్మెల్యేలను కలవరు.. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వపరం చేయిస్తే.. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరు.. అంటూ సీఎం జగన్ పై షర్మిల మాటల తూటాలు పేల్చారు. ‘ఎంతోమంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారు. వైఎస్సార్ పాలనకు.. జగన్ పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నిర్వహించిన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల మాట్లాడారు.


కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్.. దేవుడే గుణపాఠం చెప్తారట.. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగనే కారణమంటూ మండిపడ్డారు. ఇవ్వాళ వైఎస్ ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా జగన్ చేసుకున్నదే అన్నారు. దీనికి సాక్ష్యం దేవుడు… నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ.. నా యావత్ కుటుంబం అంటూ స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే.. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అని హామీ ఇచ్చారు. ఇవ్వాళ వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? అంటూ షర్మిల ప్రశ్నించారు. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, తను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపు కోసం పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించామని చెప్పారు.


వైసీపీ కోసం ఇంటిని, పిల్లలనూ వదలి రోడ్డెక్కా..


వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి… ఎండనక, వాన అనక రోడ్ల మీదనే ఉన్నా అంటూ షర్మిల అన్నారు. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశానన్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా.. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా అంటూ వైసీపీ ఎదుగుదలలో తన పాత్రపై ఆమె ఈసందర్భంగా సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానంటూ షర్మిల చెప్పారు.



గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని, దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా.. మిమ్మల్ని గెలిపించా, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అని అన్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషి.. మారిపోయాడు అన్నారు. ‘నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నా. జగన్ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు .. వైఎస్ఆర్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్న. వైఎస్ఆర్ పేరు నిలబెడతాడు అనుకున్న’ అంటూ షర్మిల చెప్పారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు అంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు.. అయినా ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోంది. జగన్.. ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు అంటూ ఎద్దేవా చేశారు.


వైఎస్ డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్.. పోలవరం ప్రాజెక్ట్ అని షర్మిల అన్నారు. అంతకు ముందు ఏ ప్రభుత్వాలూ చేయని సాహసం వైఎస్ఆర్ చేశారని చెప్పారు. వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రి ఆయిన 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో రూ.4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారని చెప్పారు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిందని, బాబు అధికారంలో వచ్చాక అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెంచాడే తప్పా ఉపయోగం లేదన్నారు.



జగన్ పాలనలో వ్యవసాయం దండగ


వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారు అని సీఎం జగన్ ను ఉద్దేశించి షర్మిల అన్నారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ… వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని విమర్శించారు. ‘ఇది రైతు రాజ్యం కాదు.. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు. ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్ లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ ఏదీ?’ అంటూ నిలదీశారు.


అన్నిటికీ సిద్ధపడే వచ్చా..


‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీని కలిశా. వాళ్ళు వైఎస్సార్ పై పెట్టుకున్న ప్రేమ, అభిమానాన్ని చూశా. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్ లో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్న’ అంటూ షర్మిల చెప్పారు. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని అని అన్నారు. ‘తనను కాంగ్రెస్ ఏపీకి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.


ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్న. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి… నేను ఇక్కడ పని చేయాలని అనుకున్న. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. నా వ్యక్తిగత నిర్ణయం అయితే… 2019లోనే నిర్ణయం తీసుకున్న. ఈ నిర్ణయంతో నేను టార్గెట్ అవుతా అని తెలుసు. నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంబం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే’ అంటూ షర్మిల చెప్పారు.

Latest News