New Railway Rule | రైల్వే కొత్త రూల్​ : జనరల్ టికెట్లకూ ఆధార్ తప్పనిసరి

భారతీయ రైల్వే కీలక నిర్ణయం. ఇకపై జనరల్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి. ఏజెంట్ల మోసాలను అరికట్టి, సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభతరం చేయడమే లక్ష్యం.

Aadhaar Mandatory for General Train Tickets: Indian Railways’ New Rule from October 1

Aadhaar Mandatory for General Train Tickets: Indian Railways’ New Rule from October 1

హైదరాబాద్‌:
New Railway Rule | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జనరల్ రిజర్వేషన్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి. ఈ నిబంధన అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. IRCTC వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌ల ద్వారా జనరల్ టికెట్ బుక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ నంబర్ నమోదు చేయాలి.

రైల్వే బోర్డు ప్రకారం, ఈ మార్పు టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యం. ఇప్పటివరకు ఏజెంట్లు, బ్రోకర్లు సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని సాధారణ ప్రయాణికులకు అవాంతరాలు కలిగించేవారు. బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు ఖాళీ అయిపోవడం వల్ల ప్రయాణికులు నిరాశ చెందుతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకే ఆధార్ ఆధారిత బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

కొత్త జనరల్​​ బుకింగ్​ నిబంధన ఏమిటి?

కొత్త నిబంధన ప్రకారం, టికెట్ బుకింగ్ ప్రారంభమైన తొలి 15 నిమిషాల వరకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. ఈ సమయంలో ఆధార్ నంబర్ లేకుండా టికెట్ బుక్ చేయడం సాధ్యం కాదు. అయితే 15 నిమిషాల తర్వాత ఆధార్ లేకుండానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు, కానీ టికెట్లు అందుబాటులో ఉన్నపుడు మాత్రమే.

జనరల్ టికెట్ల బుకింగ్ సమయం ప్రతిరోజూ అర్ధరాత్రి 12:20 గంటల నుంచి రాత్రి 11:45 వరకు ఉంటుంది. మిగతా సమయంలో మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. అలాగే ఏదైనా రైలు ప్రయాణానికి 60 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది.

ఈ నిబంధన కేవలం ఆన్‌లైన్ బుకింగ్‌కే పరిమితం అవుతుంది. స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ అవసరం లేదు. రైల్వే బోర్డు ఈ మార్పు కోసం ఇప్పటికే IRCTC, CRIS (Centre for Railway Information Systems)లకు సర్క్యూలర్ జారీ చేసింది.

పండుగ సీజన్‌లో టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. టికెట్లు బుకింగ్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏజెంట్లు మోసపూరితంగా బుకింగ్ చేసుకుంటున్నారని రైల్వే గుర్తించింది. గతంలో తత్కాల్ టికెట్లకు అమలు చేసిన ఆధార్ అథెంటికేషన్ విధానం ఇప్పుడు జనరల్ టికెట్లకు విస్తరించడం విశేషం.

రైల్వే అధికారులు ఈ కొత్త నిర్ణయంతో సామాన్య ప్రయాణికులకు ఊరట లభిస్తుందని నమ్ముతున్నారు. టికెట్లు సులభంగా లభించే అవకాశం పెరగడంతోపాటు, మోసాలు అరికడబడతాయని వారు భావిస్తున్నారు. “మోసాలను అరికట్టి, పారదర్శకత పెంచడమే మా లక్ష్యం” అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

Exit mobile version