విధాత,న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే పరీక్షల రద్దు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మార్కులు, ఫలితాల వెల్లడికి కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంపై ధర్మాసనం స్పందిస్తూ పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. పరిక్షల నిర్వహణకు సంబంధించి నిన్న ఏం చర్చించారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కోర్టు విచారణ తర్వాత పరీక్షలు రద్దు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందించిన ధర్మాసనం.. పరీక్షల రద్దు మానవీయతకు సంబంధించిన అంశమని పేర్కొంది. జులై 31లోగా ఫలితాలు వెల్లడించాలని పేర్కొంటూ పిటిషన్లపై విచారణ ముగించింది.
ReadMore:హైకోర్టు మల్లన్న సాగర్ కీలక తీర్పు