విధాత: వరుస ఓటములు, కీలక నేతల రాజీనామాలతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి.. ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఆయన వెంట భారత్ యాత్రీస్(కాంగ్రెస్ నేతలు) ఉన్నారు.
అధికారికంగా ఈ యాత్ర నిన్న సాయంత్రమే ప్రారంభమైనా.. ఈ రోజు నుంచి నడక మొదలైంది. ఈ క్రమంలో ఆయన ప్రజలతో ముచ్చటిస్తున్నారు. వారి ఆవేదనలు వింటున్నారు. 2017లో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థిని అనిత కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ జోడో యాత్ర సాగనున్నది.12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళ్తారు. ప్రతిరోజూ రెండు విడతల్లో… ఉదయం 7 గంటల నుంచి 10.30 గం.ల వరకు, మధ్యాహ్నం 3.30గం.ల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పాదయాత్ర కొనసాగనున్నది.