ఐపీఎల్లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ మరోసారి భరోసా కల్పించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత విదేశీ ఆటగాళ్లు సురక్షితంగా వారి దేశాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొందరు విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్న తరుణంలో బీసీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) హేమంగ్ అమిన్ ఆటగాళ్లను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేశారు. ‘‘విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు పంపుతాం. ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. మీ భద్రత మా బాధ్యత. ఆటగాళ్లకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. వారి గమ్యస్థానాలకు సజావుగా చేర్చేందుకు బీసీసీఐ భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది’’ అని హేమంగ్ తెలిపారు.