Nalgonda : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి

'బెస్ట్ అవైలబుల్ స్కీమ్' పెండింగ్ బిల్లుల కోసం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కలెక్టర్ కారును అడ్డుకుని తమ సమస్యలు వివరించారు.

best-available-scheme-students-protest-at-nalgonda-collectorate

విధాత : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన “బెస్ట్ అవైలబుల్ స్కీమ్” కింద గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కారును అడ్డగించి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను నిలదీశారు.

ఆందోళనలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి, విద్యార్థులను తిరిగి ప్రైవేట్ స్కూల్స్‌లో చేర్పించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,038 స్కూల్స్‌లో 23 వేలమంది ఎస్సీ విద్యార్థులు, 7 వేలమంది ఎస్టీ విద్యార్థులు బకాయిలు చెల్లించకపోవడంతో స్కూల్ యాజమాన్యం వారిని బయటకు పంపిందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ.. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లలో, హాస్టళ్ళలో చేర్చించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తీక్, మామిడి జగన్, స్వామి, గాదె నర్సింహ, శోభన్, పేరుమల్ల సాహితి, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.