- పూర్తి వివరాలతో రేపు సమీక్షకు రావాలి
- అధికారులపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం?
- సీఎండీ రాజీనామా ఆమోదించొద్దని ఆదేశం!
- సమీక్షకు రప్పించాలని స్పష్టీకరణ
విధాత: విద్యుత్తు సంస్థలకు వేల కోట్ల రూపాయల అప్పులు ఉండటంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తంచేశారని తెలుస్తున్నది. గురువారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా విద్యుత్తు అంశంపైనే ఎక్కువ చర్చించారని సమాచారం.
విద్యుత్తు సంస్థలు 85 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. విద్యుత్తు శాఖకు సంబంధించి ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా తదితర అన్ని అంశాలపై పూర్తి వివరాలతో శుక్రవారం జరిగే సమీక్షా సమావేశానికి రావాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారని విశ్వసనీయంగా తెలిసింది. ట్రాన్స్కో, జన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయనను ఈ సమీక్షా సమావేశానికి రప్పించాలని స్పష్టం చేశారని సమాచారం.