విధాత: అమరావతి ప్రాంతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేశారు. అమరావతి కృష్ణాయపాలెం శివారులో జగన్ పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా నమూనా ఇంటి నిర్మాణంతో పాటు ఒక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
వైసీపీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ వర్గాలు మండిపడుతుండగా, అక్కడ ఇళ్ల స్థలాలు పొందిన పేదలు తమకు ఆ స్థలాలు కొనసాగిస్తారో లేదోనన్న ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం అనంతరం వైసీపీ శ్రేణులపై అక్కడక్కడ దాడులు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన కూడా చోటుచేసుకుందని భావిస్తున్నారు.