Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడింది.
కేవలం నగదును పరిశీలిస్తే శనివారం రాత్రి వరకు రూ.48,32,99,968 నగదు పట్టుబడింది. రూ.4,72,52,850 విలువైన మద్యం, రూ.2,48,95,710 విలువ చేసే డ్రగ్స్, రూ.17,50,02,116 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, రూ.1,90,80,553 విలువ చేసే ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు తనిఖీ బృందాలు క్రియాశీలకంగా విధులు నిర్వర్తిస్తున్నాయి. రూ.50వేలకు మించి నగదు, ఆభరణాలు తీసుకెళ్తే.. తప్పనిసరిగా సంబంధిత రశీదులు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.