కదులుతున్న రైల్లో మహిళపై లైంగిక దాడి.. పోలీసులకు చిక్కకుండా డ్రామా

కదులుతున్న రైల్లో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు.. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్నది.

  • Publish Date - December 11, 2023 / 12:24 PM IST

  • మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన..
  • పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నిందితుడు
  • మూడు గంటల తర్వాత అరెస్ట్‌


భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైల్లో ఒక 30 ఏళ్ల మహిళ లైంగిక దాడికి గురయ్యారు. ఈ ఘటన పకారియా, మైహర్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఖాళీగా ఉన్న ఏసీ స్పెషల్‌ ట్రెయిన్‌లో చోటు చేసుకున్నది. నిందితుడి నుంచి తప్పించుకున్న మహిళ సాత్నా స్టేషన్‌ వద్ద రైలు కదులుతున్న సమయంలో దిగిపోయి.. అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైలు వద్దకు పోలీసులు చేరుకున్నప్పటికీ.. అప్పటికే రైలు.. స్టేషన్‌ దాటి వెళ్లిపోయింది. దీంతో తదుపరి స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి, పోలీసులు రోడ్డు మార్గంలో రేవా స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. నిందితుడు ఏసీ కోచ్‌ తలుపులు లోపలి నుంచి గడియ వేసుకుని తనను తాను నిర్బంధించుకున్నాడు. దాదాపు మూడు గంటలపాటు సాగిన హై డ్రామాలో రైల్వే మెకానిక్‌లు కోచ్‌ తలుపులు తెరవడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు.


ఈ ఘటన వివరాలను సాత్నా జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ ఎల్‌ పీ కశ్యప్‌ మీడియాకు తెలియజేశారు. 30 ఏళ్ల ప్రయాణికురాలు సాత్నా జిల్లాలోని ఉంచెహ్రా వెళ్లేందుకు కట్ని స్టేషన్‌లో రైలు ఎక్కారు. అయితే.. ఆమె ప్రయాణిస్తున్న ప్యాసింజెర్‌ పకారియా స్టేషన్‌ వద్ద ఆగింది. అదే సమయంలో రేవా వెళుతున్న మరో స్పెషల్‌ ట్రెయిన్‌ కూడా దాని పక్కనే ఆగింది. ఈ సమయంలో రెస్టు రూమ్‌ను ఉపయోగించుకునేందుకు బాధితురాలు స్పెషల్‌ ట్రెయిన్‌లోకి మారారు. ప్యాసింజర్‌ రైలులో ఉన్న నిందితుడు ఆమె స్పెషల్‌ ట్రెయిన్‌లోకి వెళ్లటాన్ని గమనించి.. ఆమెను అనుసరించాడు. స్పెషల్‌ ట్రెయిన్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడి పెట్టేశాడు. బలవంతంగా రెస్ట్‌రూమ్‌లో చొరవడి.. ఆమెపై దాడి చేశాడు. భయాందోళనకు గురైన ఆమెపై లైంగిక దాడికి పాల్పడాడ్డు’ అని వివరించారు. తాను మైహర్‌ స్టేషన్‌ వద్ద దిగిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని బాధితురాలు చెబుతున్నట్టు కశ్యప్‌ తెలిపారు. తదుపరి రాత్రి 8 గంటల ప్రాంతంలో సాత్నా స్టేషన్‌ వద్ద రైలు దిగిన బాధితురాలు.. తమకు సమాచారం ఇచ్చారని, వెంటనే తాము రైలు వద్దకు చేరుకున్నా.. అప్పటికే అది స్టేషన్‌ దాటి వెళ్లిపోయిందని చెప్పారు.


స్టేషన్‌ మాస్టర్‌ సహకారంతో సమీపంలోని కైమా స్టేషన్‌ వద్ద రైలును ఆపించామని, తాము రోడ్డు మార్గంలో అక్కడికి చేరుకున్నామని పేర్కొన్నారు. కానీ.. నిందితుడు లోపలి నుంచి డోర్‌ లాక్‌చేసుకున్నాడని, అక్కడి నుంచి రైలు రేవా స్టేషన్‌కు చేరుకున్నాక రైల్వే మెకానిక్స్‌ సహకారంతో డోరు తెరిపించామని, రాత్రి 11.30 గంటల సమయంలో నిందితుదిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేశ్‌ కుశ్వాహా (22)గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కట్ని జిల్లాలో నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు నిందితుడిని సాత్నా తీసుకువచ్చి, అక్కడి నుంచి  కట్నికి తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Latest News