తప్పిపోయిన బీజేపీ ఎమ్మెల్యే భార్య‌.. 24 గంట‌ల త‌ర్వాత ఆచూకీ ల‌భ్యం

  • Publish Date - November 2, 2023 / 03:00 AM IST

ల‌క్నో : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే సీతారాం వ‌ర్మ భార్య పుష్ప వ‌ర్మ త‌ప్పిపోయారు. 24 గంట‌ల త‌ర్వాత ఆమె ఆచూకీ ల‌భ్య‌మైంది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లాంబువా నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ ఎమ్మెల్యే సీతారాం వ‌ర్మ ల‌క్నోలో త‌న భార్యా, పిల్ల‌ల‌తో నివాసం ఉంటున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే భార్య పుష్ప వ‌ర్మ ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఎంత‌సేప‌టికి తిరిగి రాక‌పోవ‌డంతో ఎమ్మెల్యే కుమారుడు ఘాజిపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. ఘాజిపూర్‌కు 330 కిలోమీట‌ర్ల దూరంలోఉన్న సేఫ్దాబాద్‌లో పుష్ప వ‌ర్మ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్క‌డి పోలీసులు పుష్ప వ‌ర్మ‌ను ల‌క్నోకు తీసుకొచ్చారు.

పుష్ప వ‌ర్మ అమ్నేషియాతో బాధ‌ప‌డుతున్నార‌ని, అందుకు చికిత్స తీసుకుంటున్నార‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఎమ్మెల్యే సీతారాం వ‌ర్మ కుమారుడు పంక‌జ్ కుమార్ రిటైర్డ్ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్. భార్య క్షేమంగా ఇంటికి రావ‌డంతో ఎమ్మెల్యే పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Latest News