ప్రియుడితో కలిసి వివాహిత చేసిన పని.. పసిగట్టేసిన పోలీసులు

ప్రియుడి అప్పులు తీర్చేందుకు ఓ వివాహిత తప్పుడు కేసు పెట్టి.. అడ్డంగా పోలీసులకు బుక్‌ అయిపోయింది.

  • Publish Date - November 17, 2023 / 12:04 PM IST

బిజ్నూర్‌: ఓ 34 ఏళ్ల వివాహిత.. తన ఇంట్లోకి ఐదారుగురు చొరబడి తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని, ఇంట్లో ఉన్న పది లక్షల విలువైన ఆభరణాలను దోచుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. మరుసటి రోజే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి.. కటకటాల వెనక్కు నెట్టారు. ఇంతకీ.. అరెస్టయింది ఎవరో కాదు.. సదరు వివాహిత ప్రియుడే! అసలు విషయం ఏమిటంటే.. అప్పులు తీర్చడానికి వీరిద్దరూ ఆడిన రేప్‌, లూటీ డ్రామా ఇది!


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై లైంగిక దాడి చేసి, నగలు దోచుకెళ్లారని నిందితురాలు తన భర్తతో కలిసి బుధవారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లోకి ఆరుగురు వ్యక్తులు మంగళవారం పొద్దుపోయిన తర్వాత పైకప్పు తొలగించి, చొరబడ్డారని, తన భార్యకు మత్తు ఇచ్చి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని, తన భార్య శరీరంపై సిగరెట్‌ పీకలతో కాల్చారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.


అయితే.. పోలీసులు ప్రశ్నించే సమయంలో ఆ మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అనుమానించారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆమె రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లోకి దుండగులు చొరబడ్డారని చెప్పింది. సాధారణంగా ఆ సమయంలో ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో వేరే ఎవరూ లేరని కూడా ఆమె పేర్కొంది. అయితే.. ఈ సమయంలో ఆమె, ఆమె ప్రియుడు పదే పదే ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళ శరీరంపై ఉన్న గాయాలు.. వారు చేసుకున్నవేనని తేలింది. వైద్య పరీక్షలకు పంపగా.. ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరుగలేదని స్పష్టమైంది. పోలీసులు సూటిగా పలు విషయాలపై ప్రశ్నించడంతో ఆమె భోరున విలపిస్తూ.. అసలు విషయాన్ని బయటపెట్టింది.

Latest News