Chiranjeevi| డ్రగ్స్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి పదే పదే సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పాటునందించాలంటూ పిలుపునిచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో ఒక వీడియోని రూపొందించారు. అందులో డ్రగ్స్కి బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ పిలుపునిచ్చారు. ఈ వీడియోపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏదైనా కొత్త సినిమా రిలీజైతే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోల కోసం ప్రభుత్వం వద్దకు వస్తున్నారు తప్ప సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో సినీ ఇండస్ట్రీ ఉండట్లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుండి టికెట్ల ధరలు పెంచాలని ఎవరైనా సినిమా వాళ్లు జీవోల కోసం వస్తే, వాళ్లు తప్పనిసరిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేలా ప్రీ నిబంధంనలు విధించాలని రేవంత్ రెడ్డి అన్నారు.అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేయగా, దానికి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “థాంక్యూ రేవంత్ రెడ్డి గారూ…సమాజానికి ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అని అన్నారు.
అయితే చిరంజీవి నటించిన ఈ యాడ్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, దానికి దర్శకత్వం ఎవరు వహించారంటూ చర్చ నడుస్తుంది.ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి యాడ్ చిత్రీకరించినట్టు తెలిసింది. యాడ్ చిత్రీకరణ తర్వాత మాట్లాడిన ఆయన.. ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి ఈ ఇండస్ట్రీకి రావాలనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్లో నేనూ ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందని, కాని కోరికలకి అంతే ఉండదంటూ స్పష్టం చేశారు. ఈ దర్శకుడు గతంలో అల్లు అర్జునన్తో ఏబీసీడీ మూవీ తెరకెక్కించాడు.