విధాత, హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించి.. ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు జరిగే సమావేశంలో మంత్రి వర్గం తుది నిర్ణయం తీసుకోనుంది.
పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్లాలా? లేదా 42 శాతం రిజర్వేషన్లతో వెళ్లాలా? అనేది దానిపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది. అలాగే ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ, ఎస్ ఎల్బీసీ పనులు, ఎస్సారెస్పీ రెండో దశకు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు అంశాలపైనా చర్చించనున్నారని, రైతు భరోసా స్కీమ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.