Site icon vidhaatha

సినీ ఇండస్ట్రీ విషయంలో నేను న్యూట్రల్: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్ట్ 24(విధాత): సినిమా పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలన్నారు. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతాని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని సూచించారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని సీఎం తెలిపారు. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని హామినిచ్చారు.
‘తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించా. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా తమ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామన్నారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల పాల్గొన్నారు.

Exit mobile version