Site icon vidhaatha

నమ్మిన స్నేహితుడే నరహంతకుడై..

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణహత్య

– నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన

విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణహత్యకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చాడు. సదాశివ నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లుర్ లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా, ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు.


ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. పథకం ప్రకారం ప్రసాద్ ను బయటకు తీసుకెళ్ళి, నిజామాబాద్-కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి.. మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను కూడా బయటకు తీసుకెళ్ళాడు. పథకమం ప్రకారమే ఆమెను కూడా హతమార్చి, శవాన్ని బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో.. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం.


మాక్లుర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 24 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని, మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకుగురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా అదృశ్యం కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి, కుటుంబాన్ని అంతమొందించటం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Exit mobile version