Health tips : ప్రతి ఒక్కరికీ ఏదో ఒకసారి సాధారణంగా ఎదురయ్యే కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు వంటింట్లోనే చక్కని పరిష్కారం దొరుకుతుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే జీలకర్ర, మెంతులు, పసుపు, యాలకులు, లవంగం, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటాం. అందులో అజీర్తి సమస్యకు మెంతులు చక్కని పరిష్కారం చూపుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో కూడా తోడ్పడుతాయి. మెంతులను వివిధ రకాలుగా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
మెంతులతో ప్రయోజనాలు
1. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.
2. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగాలి. దాంతో అజీర్తి సమస్య తొలగిపోతుంది.
3. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దాంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడంవల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. కాబట్టి స్థూలకాయులకు కూడా మెంతులు నిత్యావసరం.
4. మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పొడిని కూరల్లో కూడా వాడుకోవచ్చు.
5. ఒక చెంచా మెంతులను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడంవల్ల కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి.