CM REVANTH REDDY । తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో హింట్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

కన్నతల్లిని తల‌పించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్ర‌హం ఉండాలనేది త‌మ అభిమ‌త‌మ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. దొర‌ల గ‌డీల ఆన‌వాళ్లు విగ్ర‌హంలో ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు.

  • Publish Date - August 28, 2024 / 06:17 PM IST

CM REVANTH REDDY । 2014 నుంచి 2024 వ‌ర‌కు ప‌దేళ్లు తెలంగాణ‌ను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామ‌ని, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని గొప్ప‌లు చెప్ప‌కున్నార‌ని, కానీ  తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ప‌దేళ్ల‌లో రూ.22.50 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి స‌చివాల‌యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు  మనసు రాలేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. తామే తెలంగాణ‌కు స‌ర్వ‌స్వ‌మ‌ని భావించార‌ని, తానే తెలంగాణ… తెలంగాణే తాను అనే విధంగా విధంగా గత పాలకులు వ్యవహరించార‌ని విమ‌ర్శించారు.  కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అలాంటి విధానాల‌కు విరుద్ధ‌మ‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరిట గ‌డీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు ప‌హారా పెట్టుకొని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అందులోకి రాకుండా నిషేధించార‌ని, తాము అధికారంలో వ‌చ్చాక ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరును ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ‌డీగా మారిన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని చెప్పారు.

డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ప‌రిపాల‌న‌కు గుండెకాయ వంటి స‌చివాలయ ప్రాంగ‌ణంలో డిసెంబ‌రు 9వ తేదీన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఘ‌నంగా ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ల‌క్ష‌లాది మంది తెలంగాణ బిడ్డ‌ల స‌మ‌క్షంలో ఆ రోజు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు. రాష్ట్ర స‌చివాల‌యం ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హా ప్ర‌తిష్టాప‌న‌కు భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం నిర్వ‌హించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని వైభ‌వంగా నిర్వ‌హించాల‌నుకున్నామ‌ని, వేద పండితుల‌ను సంప్ర‌దిస్తే ఈ రోజు మిన‌హా ద‌స‌రా వ‌ర‌కు మంచి రోజులు లేవని చెప్పార‌న్నారు. ముందుగా నిర్ణ‌యించిన మేర‌కు ఉప ముఖ్య‌మంత్రి కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం, మంత్రుల ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌డంతో హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌న్నారు.

రాజీవ్‌ విగ్రహం లేకపోవడం లోటు.. అందుకే

పాల‌న‌కు గుండెకాయ లాంటి స‌చివాల‌యంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని తాము నిర్ణ‌యించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నెక్లెస్ రోడ్‌, ట్యాంక్ బండ్ చుట్టుప‌క్క‌ల ఈ దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేడ్క‌ర్‌, ఇందిరా గాంధీ, అంజ‌య్య‌, పి.వి.న‌ర‌సింహారావు, కాకా వెంక‌ట‌స్వామి విగ్ర‌హాలు, జైపాల్ రెడ్డి స‌మాధి ఉన్నాయ‌ని, వీటి మ‌ధ్య రాజీవ్ గాంధీ విగ్ర‌హం లేకపోవడం లోటుగా క‌నిపించింద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. స‌చివాల‌యం ఎదుట ప్ర‌దేశాన్ని త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం కొంద‌రు ఉంచుకోవాల‌ని భావించార‌ని, కానీ మేధావుల సూచన మేరకే తాము అక్క‌డ‌ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి తెలిపారు. దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్ర‌హం పెడితే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆనాడే చెప్పా..

పదేళ్లు అధికారంలో ఉండి గ‌త పాల‌కులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేద‌ని, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ రెండో తేదీనే తాను ప్ర‌క‌టించాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  కన్నతల్లిని తల‌పించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్ర‌హం ఉండాలనేది త‌మ అభిమ‌త‌మ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. దొర‌ల గ‌డీల ఆన‌వాళ్లు విగ్ర‌హంలో ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. అందుకే తెలంగాణ ప్ర‌జ‌ల అభిమ‌తానికి త‌గిన‌ట్లు తెలంగాణ త‌ల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ‌, జేఎన్ టీయూ  ఫైన్ ఆర్ట్స్ విభాగం క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌కు అప్పగించామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని 2009, డిసెంబ‌రు 9న మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జ‌న్మ‌దినం కావ‌డంతో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్య‌మంత్రి అన్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ప‌లువురు శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, ఎంపీలు, కార్పొరేష‌న్లు ఛైర్మ‌న్లు, అధికారులు పాల్గొన్నారు.