విధాత: పాకిస్తాన్లోని ముల్తాన్ సిటీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రి కప్పు పైభాగంలో గుట్టల కొద్ది మృతదేహాలు పడి ఉన్నాయి. దాదాపు 200 దాకా డెడ్బాడీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిస్తార్ హాస్పిటల్ మార్చురీ పైకప్పు భాగంలో ఉన్న మృతదేహాలపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. విచారణకు ఆదేశించింది.
అయితే ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సలహాదారు తరీఖ్ జమాన్ గుజ్జార్ స్పందించారు. గుట్టలకొద్ది మృతదేహాలు లభ్యం కావడంతో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసమే శవాలను మార్చురీ వద్ద అలాగే ఉంచినట్లు ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా గుర్తు తెలియని డెడ్ బాడీలను ఆస్పత్రికి అప్పగించారని తెలిపారు. అన్ని కలిపి కుప్పలుగా పేరుకుపోయాయని చెప్పారు.
మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మెడికల్ స్టూడెంట్స్ ఆ మృతదేహాలను వాడిన తర్వాత సరైన రీతిలో డీకంపోజ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.