Ban on Dogs: ప్రమాదకరమైన జాతులకు చెందిన కుక్కల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడి చేస్తూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన శునకాలపై కేంద్రం నిషేధం విధించింది. ఆ 23 జాతుల కుక్కలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొంది.
కేంద్రం నిషేధం విధించిన శునక జాతుల్లో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితరాలు ఉన్నాయి.
నిషేధం విధించిన ఆయా జాతుల శునకాల సంతాన వృద్ధిని అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.