విధాత : స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నగరం నడిబొడ్డున ఉన్న జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాపూజీకి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈరోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.