- వినయ్ భాస్కర్పై ఉద్దేశపూర్వక ఆరోపణలు
- భూ కబ్జాదారులు నీతులు చెబుతున్నారు
- రాజకీయ లబ్ధికోసమే యాత్రలు
- హనుమకొండ బీఆర్ఎస్ నేతల విమర్శ
(HANUMAKONDA)హనుమకొండకు చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు తోట పవన్ పైన జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పైన కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు (four times)ఎమ్మెల్యేగా గెలుపొంది, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేక నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దురుద్దేశంతో రాజకీయ లబ్ధికోసం ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్యమద్రోహులు నిఖార్సైన ఉద్యమకారులైన కేసీఆర్, వినయ్లపై విమర్శలు చేస్తున్నారని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. సుబేదారిలో మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో (Telangana movement) ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమ ద్రోహులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు విద్యార్థి ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.
కాళోజీ కళా క్షేత్రానికి మూడు వందల గజాల స్థలం ఇవ్వని కాంగ్రెస్ నేతలు కళాక్షేత్రం గురించి మాట్లాడడం విడ్డూరం అని కుడా చైర్మన్ అన్నారు. ఏకశిల పార్కును అభివృద్ధి చేసి, జయశంకర్ (jayashankar) స్మృతివనం, కాళోజీ, జయశంకర్ సర్ పేరిట విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు. తెలంగాణ ఆస్తులను కూల్చేయాలి, పేల్చేయాలి అనడం మన దౌర్భగ్యం అని వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేసి, రోల్మోడల్గా (Rollmodel)నిలిపిన నాయకుడు కేసీఆర్ అని వివరించారు.
– దందా చేసి నీతులు చెబుతున్నారు
భూ కబ్జాలు, దందాలు చేసిన వారు దోపిడీ అంటూ నీతిమాటలు చెబుతున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏం చేసిందో తెలపాలని ఆయన ప్రశ్నించారు.
యూనివర్సిటీ భూ కబ్జాలు, లిక్కర్ దందాలు, ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణాలు చేసిన వారు అవినీతి అంటూ ప్రభుత్వంపై, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, ఎలకంటి రాములు, నెక్కొండ కవిత కిషన్, గుంటి రజిత శ్రీనివాస్, చీకటి శారద అనంద్, ఏనుగుల మానస రాంప్రసాద్, ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.